మానవ సంబంధాలకు అద్దం పట్టిన నవల
నేటి సమాజం ఎటు పరిగెడుతుందో అనేది కాస్త విచిత్రంగా ఉంటుంది. ఎక్కడ చూసినా, ఎలా చూసినా, వినిపించేది, కనిపించేది ‘విడాకులు’ అనే మాటే. ప్రతి జంట తమతమ వివాహ బంధంలో ఎలాంటి సమస్యకైనా విడాకులు మాత్రమే పరిస్కారమనేంతలా మారిపోతున్నారు. ఇలాంటి కాలంలో ఇటువంటి కథ గానీ నవల గానీ చదివితే ప్రస్తుత పరిస్థితులు కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయి.

‘విధి’ నవలలో, రామ్ పాత్ర అలాంటిదే. అయితే కాస్త భిన్నంగా. తండ్రి లేని రామ్ ని తల్లి ఒంటరిగా పెంచడం వలన, అమ్మ ఏం చెప్తే అదే కరెక్ట్ అనేంతగా ఉంటుంది రామ్ ఆలోచన. అలాంటి ఒకానొక సందర్భంలో తల్లి విడాకులు తీసుకోమని చెప్పడంతో రామ్ జీవితం మలుపులు తిరుగుతుంది. రామ్ ఆలోచనలు ముందుకి వెనక్కి వెళుతూ సంక్లిష్ట పరిస్థితికి చేరుకుంటాడు.
రామ్ ఆలోచనలను మారుస్తూ తన సొంత నిర్ణయాల వైపు తాను చూపు సారించేలా చెయ్యడంలో కొన్ని పాత్రలు ముఖ్య భూమిక పోసిస్తాయి. అందులో దృఢమైన ఆలోచనలు గల తన భార్య భువి ఒకటైతే, మంచి విషయాలను విలువలను నేర్పే, తన జాగింగ్ స్నేహితుడైన 60 ఏళ్ల డాక్టర్ పరశురామ్ ఒకరు మరియు చిన్ననాటి మిత్రుడు అయిన వాసు మరొకడు.
రామ్ చుట్టూ ఉన్న పరిస్థితులు పాత్రలతో పాటు, తనకు కాలం మరియు విధి తన నిర్ణయాలను సరిదిద్దడంలో సహకరిస్తుంది. ప్రతి సమస్యకు విధి నిర్ణయాలతో పాటు కాలం దగ్గర సమాధానాలు దొరుకుతాయన్నది రచయత చెప్తున్నారు ఈ నవల ద్వారా. రచయత రామ్ తో time travel చెయ్యించి ఈ కాలానికి సరిపోయే కథగా ఈ తరానికి అర్థమయ్యే విధంగా కొంత scientific touch ఇచ్చారు.
ప్రతి సమస్యకి పరిష్కారాన్ని కనుగొనే దిశగా సాగే కథ. సాగే కాలమే కాదు, ఆలోచన తీరు విధానం మారాలి. పరిష్కారాలు తెంచుకునే దారుల్లోనే కాదు, పంచుకునే దారుల్లోనూ, సర్దుకునే విధానంలోనూ కూడా దొరుకుతాయి. అయితే ఇక్కడ విలువలు నేర్పే పెద్దలు కావాలి, ఆ తరం నేర్పే విలువలను పాటించే ఈ తరం కూడా కావాలి. మంచిని పెంచే స్నేహితులు కావాలి. అర్ధం చేసుకునే భాగస్వామి కావాలి.
ఈ నవలని ముగించిన మాటా చాలా బాగుంది. “ప్రతి మనిషిలో మంచిని, ప్రతి పనిలో మంచిని చూడగలిగితే, ప్రతి క్షణం సంతోషమే.”
ప్రతి ఒక్కరూ చదవాల్సిన ఒక మంచి పుస్తకం ఇది. అమెజాన్ లో దొరుకుతుంది.
లింక్ : https://amzn.to/42Bqi2l








